31-10-2025 11:13:54 AM
 
							తల్లి చేసిన కూలీ పనులకు దక్కిన పలితం.
పేదరికాన్ని తరిమి హైడ్రోజాలజిస్టుగా సంధ్య.
జగదేవపూర్, (విజయక్రాంతి): వట్టిపల్లి గ్రామానికి చెందిన తప్పెట్ల సంధ్య తన కృషి, పట్టుదలతో గ్రామానికే కాదు, జిల్లా ప్రజలకూ గర్వకారణమైంది. సాధారణ కుటుంబం నుండి వచ్చిన సంధ్య యూపీఎస్సీ(UPSC) నిర్వహించిన జియాలజిస్ట్ పరీక్షల్లో ఆల్ ఇండియా ర్యాంక్ 29 సాధించి విశేష కీర్తిని సంపాదించింది. సంధ్య తండ్రి తప్పెట్ల సత్యనారాయణ గత ఐదు సంవత్సరాలుగా పక్షవాత (పారాలసిస్) వ్యాధితో బాధపడుతుండగా, తల్లి తప్పెట్ల లక్ష్మి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే సంధ్య తన చదువులో అచంచలంగా ముందుకు సాగింది.
సంధ్య తన విద్యాభ్యాసాన్ని ప్రభుత్వ పాఠశాల, వట్టిపల్లిలో పదవ తరగతి వరకు పూర్తి చేసి, అనంతరం మహాత్మ జ్యోతిబా ఫూలే కళాశాల, ములుగులో ఇంటర్మీడియట్ చదివింది. ఆ తరువాత పాండిచ్చేరి యూనివర్సిటీలో జియాలజీ విభాగంలో డిగ్రీ మరియు పీజీ పూర్తిచేసి, ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్లో పీహెచ్డీ చేస్తున్నారు.తన కృషి, పట్టుదల, తల్లిదండ్రుల త్యాగాలే ఈ విజయానికి పునాది అని సంధ్య పేర్కొంది. తన విజయాన్ని గ్రామం, కుటుంబం, ఉపాధ్యాయులకు అంకితం చేస్తానని తెలిపారు.ఇక ఆమె చెల్లి తప్పెట్ల స్పందన ప్రస్తుతం పీజీ చదువుకుంటోంది.గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు సంధ్యను అభినందిస్తూ – “సంధ్య వంటి ప్రతిభావంతులే గ్రామాల నుంచి దేశానికి వెలుగునిస్తారు” అని ప్రశంసలు కురిపించారు.