21-08-2025 01:00:22 AM
-మొదటి విడతలో కర్ణాటక నుంచి 10,800 మెట్రిక్ టన్నులు
-కాంగ్రెస్ ఎంపీల పోరాటం ఫలించింది
హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): రాష్ట్రానికి యూరియా పంపిణీ విషయంలో కొంతమేర ఉపశమనం లభించింది. రాష్ట్రానికి సరిపడా యూరి యా కేటాయించాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభు త్వం ఒత్తిడి చేయడంతో పాటు పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల పోరాటం, కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి యూరియా సరఫరా చేయాలని విజ్ఞప్తులతో కొంతమేర ఫలితం ఫలించింది.
రాష్ట్రానికి ఈ వారంలో 50వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసేందుకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ ఆమోదం తెలిపింది. దీంతో కర్ణాటక నుంచి 10,800 మెట్రిక్ టన్నుల యూరియా షిప్మెంట్ ప్రారంభమైంది. ఈ వారంలో మరో మూడు షిప్మెంట్ల ద్వారా యూరియా సరఫరాకు కోర మండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రానికి ప్రస్తుతం 2.98 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది.
ఇందులో 50 వేల మెట్రిక్ టన్నుల సరఫరాకు కేంద్రం అంగీకరించింది. మిగతా యూరియాను కూడా వెంటనే సరఫరా చేయాలని తెలంగాణ ప్రభు త్వం కేంద్రాన్ని కోరుతుంది. తెలంగాణలో యూరియా కొరతపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేసి.. తెలంగాణ రైతాంగం యూరియా కోసం పడుతున్న కష్టాలను దేశానికి తెలిసేలా చేసిన ఎంపీలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు.
ప్రతిపక్ష పార్టీ తమ రాజకీయ స్వార్థం కోసం చేసే కుట్రలను రాష్ట్ర రైతాంగం తెలుసుకోవాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయకుండా కేంద్ర ప్రభుత్వం చేసిన వివక్ష వల్లే రైతులు ఇబ్బందులు పడ్డారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగం శ్రేయస్సు కోసం సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.