రైతులకు ఇబ్బందులు కలగకుండా యూరియా పంపిణీ చేయాలి
యూరియా పంపిణీ పరిశీలించిన తహసిల్దార్ బండ కవిత రెడ్డి
గరిడేపల్లి (విజయక్రాంతి): రైతులకు యూరియా పంపిణీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ చేయాలని గరిడేపల్లి తహసిల్దార్ బండ కవితా రెడ్డి(Tehsildar Banda Kavitha Reddy) అన్నారు. మండల కేంద్రమైన గరిడేపల్లిలో యూరియా పంపిణీ ప్రక్రియను బుధవారం ఆమె పరిశీలించారు. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆమె దృష్టికి రావడంతో మండలంలోని సహకార సంఘాల ద్వారా పంపిణీ చేస్తున్న యూరియాపై ఆమె ఆరా తీశారు. ఈ సందర్భంగా గరిడేపల్లి లోని సర్వారం ప్రాథమిక సహకార సంఘం ద్వారా పంపిణీ చేస్తున్న యూరియా నిల్వలు ఉన్న గోదామును ఆమె పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా యూరియాను సరఫరా చేయాలని ఆమె సహకార సంఘం అధికారులను ఆదేశించారు. రైతులు ఎక్కువసేపు క్యూ లైన్ లో నిలబడకుండా యూరియా పంపిణీ విషయంలో అవసరమైన ప్రణాళికను అమలు చేయాలని ఆమె కోరారు. ఆమె వెంట ఆర్.ఐ ప్రవీణ్, గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ ఉన్నారు.






