పరిహారం కోసం భూనిర్వాసితుల రాస్తారోకో..
10-09-2025 09:57 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం స్థలం ఇవ్వగా, ప్రభుత్వం తమకు సరైన పరిహారం ఇవ్వలేదని, కొందరికి ఒక విధంగా మరికొందరికి ఇంకో విధంగా పరిహారం ఇచ్చారని, తేడాలు చూపకుండా అందరికీ ఒకే విధంగా పరిహారం అందజేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం భూనిర్వాసితులు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్ పోల్ అడ్డుపెట్టి రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.






