15-07-2025 11:03:07 AM
హైదరాబాద్: ఢిల్లీలో రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల(Telugu state CMs) సమావేశంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం(Telangana Govt) లేఖ పంపింది. బనకచర్ల అజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాసింది. సమావేశంలో బనకచర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండా ఇచ్చింది. రేపటి భేటీలో బనకచర్లపై(Banakacherla Project) చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణాపై పెండింగ్ ప్రాజెక్టులకు(Krishna Pending Projects) అనుమతులను అజెండాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. పాలమూరు, డిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఇచ్ఛంపల్లి ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని అజెండాగా ప్రభుత్వం లేఖ రాసింది.
200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదించింది. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలని తెలిపింది. బనకచర్లపై జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, ఈఏసీ అభ్యంతరాలు తెలిపాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని లేఖలో ప్రభుత్వం ప్రస్తావించింది. బనకచర్ల విషయంలో చట్టాలు, ట్రైబ్యునల్ తీర్పుల ఉల్లంఘన జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరమే లేదని తెలంగాణ సర్కార్ పట్టుబట్టింది. గోదావరి- బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై(Godavari-Banakacherla Link Project) చర్చించటం అనుచితమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలతో కేంద్ర నియంత్రణ సంస్థలపై నమ్మకం పోతుందని ప్రభుత్వం తెలిపింది.