13-12-2025 06:56:28 PM
చిగురుమామిడి,(విజయక్రాంతి): మండలంలో 17 సర్పంచ్ స్థానాలకు, 161 వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరుగనుండగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వీటిలో 13వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన వాటికి ఎన్నికలు జరుగనున్నాయి. మండలంలో మొత్తం 34370 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సర్పంచి బరిలో 75 మంది, వార్డు స్థానాలకు 161మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. పంచాయతీ పోరుకు సంబందించి శనివారం ఎంపీ డీవో కార్యాలయ ఆవరణలో ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. 174 పోలింగ్ కేంద్రాల్లో 174 మంది పీవోలు, 262 మంది ఓపీవోలు విధులు నిర్వహిస్తున్నారు. మండలాన్ని 3 జోన్లు, 6 రూట్లుగా విభజించారు. సిబ్బందిని బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఎన్నికల విదులు నిర్వహించే అధికారులకు తహసీల్దార్ రమేష్, ఎంపీడీవో విజయ్ కుమార్, ఎంపీవో కిరణ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు.