అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి
అనారోగ్యంతో మృతి చెందిన అరుణ్ రెడ్డి
స్వస్థలం నాగర్కర్నూల్ జిల్లా గంగారం
బిజినేపల్లి, జూన్ 22: నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని గంగారం గ్రామానికి చెందిన సాయి అరుణ్రెడ్డి(26) అనే యువకుడు అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి, అక్కడే అనారోగ్యంతో మూడు రోజుల క్రితం మృతి చెందాడు.
సాయి అరుణ్రెడ్డి తల్లి సరళమ్మ గ్రామంలోనే అంగన్వాడీ కార్యకర్తగా పని చేస్తుండగా, తండ్రి వెంకట్రెడ్డి వ్యవసాయం చేస్తున్నాడు. అరుణ్ బి.టెక్ పూర్తి చేసుకుని అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లాడు. కొద్ది నెలలుగా అరుణ్ అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. వైద్యం చేయించుకున్నా, బాగోగులు చూసేవారు లేక ఫలితం లేకుండా పోయింది.
వ్యాధి ముదిరి మూడు రోజుల క్రితం తాను ఉండే ఇంటిలోనే చనిపోయాడు. అరుణ్ మృతదేహం ఇండియాకు తీసుకురావడానికి దాదాపు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అరుణ్ మృతదేహం స్వగ్రామానికి రావడానికి మరో మూడు రోజుల వరకు సమయం పట్టవచ్చు.






