17-07-2025 12:37:54 AM
ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో ఎమ్మెల్యే అనిల్ కుమార్రెడ్డి
యాదాద్రి భువనగిరి, జూలై 16 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం రోజు ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని ఏ.ఆర్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర రావు పాల్గొన్నారు.
భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు మొదలుపెట్టిన ముందు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందన్నారు. సంక్షేమ పథకాలు మహిళలు ధైర్యంగా ముందుకు తీసుకుపోతున్నందుకు మహిళలందరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరు మీదనే పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు.
ఇలా ఏ రంగంలో చూసినా మహిళలకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారని, కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనేదే ముఖ్యమంత్రి ఆలోచన అని అన్నారు.
జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు డిఆర్డిఏ ప్రాజెక్ట్ అధికారి నాగిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు రేఖా బాబూరావు, భీమా నాయక్, స్టేట్ డిజిఓ ట్రెజరర్ మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మహిళా సమైక్య అధ్యక్షురాలు రేణుక ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.