12-07-2025 12:46:41 AM
రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క.
ములుగు, జూలై11(విజయక్రాంతి): పేదవాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క అన్నారు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజా,నిర్మాణం పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క,అదనపు కలెక్టర్ స్థానిక సంస్థ సంపత్ రావు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి,గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి 5లక్షల రూపాయలతో ఇండ్లను నిర్మించుకోవడానికి అవకాశం కల్పించిందని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. పేదవారి సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన నిరుపేదల అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.
ఆదివాసీల సాంప్రదాయాలు దెబ్బతినకుండా ఘనంగా జాతర ఏర్పాట్లు.
ములుగు, జూలై11(విజయక్రాంతి): ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో వచ్చే సంవత్సరం జనవరి 28నుండి 31వ తేదీ వరకు జరుగనున్న శ్రీసమ్మక్క సారలమ్మ మహా మేడారం జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేస్తామని,ఆదివాసి సాంప్రదాయాలు దెబ్బ తినకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
శుక్రవారం ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి,జిల్లా గ్రంథాలయ చైర్మన్ భానోత్ రవిచందర్ లతో కలిసి మేడారంలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకోగా గిరిజన పూజారులు డోలు వాయిద్యాల మధ్య ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సమ్మక్క,సారలమ్మ, పగిడిద్దరాజు,గోవిందరాజు,జంపన్న గణ కీర్తిలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.
వేల సంవత్స రాల పాటు నిలిచిపోయేలా సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరుగు తుందని,ఇప్పటికే జాతరలో శ్వాశత పనులు జరుగుతుండగా మరో 112 కోట్ల రూపాయలతో సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వానికి అంచనాలు తయారు చేసి నివేదిక సమర్పించడం జరిగిందని అన్నారు.
మేడారం మహా జాతరను విజయవంతం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి,దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రత్యేక చొరవ తీసుకుంటు న్నారని,జాతరకు కావలసిన నిధులను వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. క్యూలైన్ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని,జాతర విజయవంతానికి జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో సమన్వయంగా ముందుకు సాగాలని సూచించారు.