16-06-2025 11:28:01 PM
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..
నిర్మల్ (విజయక్రాంతి): రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారి సమస్యల పరిష్కారానికి రైతునేస్తం కేంద్రాలు కీలకంగా పనిచేయనున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నిర్మల్ గ్రామీణ మండలంలోని చిట్యాల రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు.
పంటల సాగు, పెట్టుబడులపై వచ్చే భారం తగ్గించేందుకు రైతు భరోసా పథకాన్ని నేటి నుంచే అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్లకు అనుమతులు మంజూరు చేశామని, గృహ నిర్మాణానికి సిద్ధంగా ఉన్న లబ్ధిదారులకు తక్షణమే అనుమతులు ఇవ్వనున్నట్టు తెలిపారు. గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివాదాస్పద భూములపై స్పష్టత ఇవ్వడంలో ఈ సదస్సులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు జిల్లా స్థాయిలో సమర్థవంతంగా అమలవుతున్నాయని, ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి అంజి ప్రసాద్, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.