07-10-2025 12:02:19 AM
మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట, అక్టోబర్ 6 (విజయక్రాంతి): దసరా పండుగ అంటేనే చెడుపై మంచి విజయం సాధించడమేనని, రాబోయేదంతా మంచే జరగాలని, అమ్మవారి దీవెనలతో రాష్ట్రంలో దుర్మార్గుల, దుష్టుల పాలన అంతమై రామరాజ్య స్థాపన జరిగిందనీ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోనీ అంబేద్కర్ నగర్ 19, 37 వార్డులో జరుగుతున్న శ్రీ దుర్గామాత నిమజ్జనం ఊరిగేంపులో పాల్గొన్న హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ. మన సిద్దిపేట మరింత అభివృద్ధి చెందాలనీ, ప్రజలుఅంతా చల్లగా ఉండాలని, ఆ అమ్మవారు మనందరినీ దీవించాలని, మీ కోరికలు నెరవేర్చాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మళ్లీ మన బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ సారధ్యంలో ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాననీ వెల్లడించారు. గడిచిన రెండు సంవత్సరాల నుండి కనీసం రోడ్డు మీద గుంత పడితే పూడ్చే పరిస్థితి లేదన్నారు.
ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదనీ విమర్శించారు. దళిత బంధు, బీసీ బందు బందైపోయిందనీ, రెండు బతుకమ్మలు, రెండు దసరాలు పోయినాయి. బతుకమ్మ చీరలు మాత్రం రాలేదు, కెసిఆర్ కిట్టు లేదు. న్యూట్రిషన్ కిట్టు లేదు. కల్యాణ లక్ష్మి చెక్కులు కూడా రాని పరిస్థితి నెలకొందన్నారు. కెసిఆర్ పాలనలో ఈ నగరాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకున్నామని తెలిపారు.
జిల్లా కేంద్రంగా మార్చుకున్నాం, పోలీస్ కమిషనరేట్ సాధించుకున్నాం, రంగనాయక సాగర్ ను నిర్మించుకున్నాం, కోమటి చెరువు ఎల్లప్పుడూ నిండి ఉంటుంది, తాగునీటికి ఇబ్బంది లేదు, అమ్మవారి దీవెనతో ఇంకా రాబోయే రోజుల్లో సిద్దిపేటను అద్భుతంగా తీర్చిదిద్దుకున్నామని మరిన్ని పరిశ్రమలు సాధించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.