calender_icon.png 16 June, 2025 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాన్యుని హృదయావిష్కరణ

16-06-2025 12:00:00 AM

వస్తు వైవిధ్యంలో కానీ, శిల్ప రీతులలో కానీ కాసుల ప్రతాపరెడ్డి కవిత్వలో ఆయనే కనిపిస్తాడు తప్ప ఏ ఇతర కవుల ప్రభావమో, ఏ ఉద్యమాల ప్రభావమో, ఏ ఇజాల ప్రభావమో కనిపించదు. అందుకే, ఎంతో సాదాసీదాగ తనకు తానుగా సహజమైన ధోరణిలో, మరో మాటలో ఒక రొటీన్‌లాగా మనఃస్పృహల ప్రమేయాలకు అతీతంగా, జీవితం కొనసాగుతుందో ప్రతాప్ కవిత్వం కూడా అంత సహజంగా భుజం తట్టి చేతిలోకి చేతిని తీసుకుని మాట్లాడుతున్నట్లు ఉంటుంది తప్ప, పాండిత్య ప్రకర్ష కానీ అకడమిక్ ట్రైనింగ్ నుంచి ప్రోది చేసుకున్న పరిజ్ఞాన ప్రకోపాలు కానీ కనిపించవు. తన కవిత్వమంతా పేదరాశి పెద్దమ్మ కతలే. గోరుముద్దలే. లాలిపాటలే.

పిల్లగాలి వూసులే. గడ్డిపూలమీద మంచుబిందువులే. భాషలో, పదజాలంలో, పదబంధాల్లో, వాక్య నిర్మాణాల్లోనూ అనువంశికంగా సొంతమై పోయిన అమ్మ చనుబాల వాసనలే, ఆడి పాడిన మట్టివాసనలే తప్ప యూనివర్సిటీ చదువుల వల్లనో, పుస్తక పఠనం వల్లనో అబ్బి న ప్రమాణాలో కనిపించవు. ఈ శిల్ప వైవిధ్యమే ప్రతాప్ కవిత్వానికి ఆయువు పట్టు. రాస్తున్న కవిత్వంలో కవి వ్యక్తిత్వా న్ని, కవి జీవిస్తున్న జీవితాన్ని, కవితా శిల్పంలో కవి నైజా న్ని, నడతనీ అవిభాజ్యంగా చూడడాన్ని మించిన సార్థకత ఆ కవికి కానీ, అతని కవిత్వానికి కానీ ఇంకే ముంటుంది! దీన్ని సాధించిన ఘనత ఈ కవిదీ, ఇందులోని కవిత్వానిదీ.

సున్నితమైన హాస్యం గర్భితంగా వ్యంగ్యాన్ని పండిచడం ద్వారా జీవితపు కఠోరమైన వాస్తవాలను ప్రకటించడంలో కాసుల సిద్ధహస్తుడు. ‘వాళ్లు కోడిగుడ్డు ఈకలు పీకుతుంటారు/ నేను పిల్లలని చేస్తుంటాను’ అంటాడు ఒకచోట. కాగా, మెటఫర్ల కోసం, ప్రతీ కలకోసం పని గట్టుకొని వెతుకులాడుకోవడం, భారంగా జొప్పించడం వంటి అనవసరమైన శ్రమకు పాల్పడడం ఈ కవిత్వంలో నిషిద్ధం.

అనవసరమైన ప్రాకులాటలకు పాల్పడని అంటున్నానే కాని నిజానికి బలమైన ఇమేజరీనే ఈ కవిత్వానికి ఆయువు పట్టు. కొన్ని కవితలైతే ఆసాంతం స్థూలంగా కవితా వస్తువుకు నిలువెత్తు మెటఫర్ మాదిరిగా తోస్తాయి. ‘దుఃఖాన్ని తాడులా పేనడం, నా మొల్దారాన్ని దండెం కట్టి నా కండకండనూ దోర్నాలు కట్టినోడా, విద్యుత్తరంగాల పగ్గాలతో యముడు మాటేయవొచ్చు’ వంటి ఆశ్చర్యాన్ని గొల్పే బలమైన ప్రతీకలు ఈ కవిత్వం నిండా కోకొల్లలు. 

కొన్ని కవితల్లో అలవోకగానైనా సరదాగా కోట్ చేస్తున్నట్లు అనిపించే హిందీ, తెలుగు సినిమా పాటల పంక్తులు, పద్య పంక్తులు అయా సందర్భాలకు చక్కగా ఇమిడిపోయి కవితలకు కొత్త సింగారాన్ని అలరిస్తాయి. కొత్త అర్థాన్ని ఆపాదిస్తాయి. క్షణంలో పాఠకుడు గంభీర వదనుడైపోతాడు. కొత్త లోతుల ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. ఉదా॥కు, తన కొడుకు అకాల మరణాన్ని విలపిస్తున్న ఇరవై పంక్తుల ఎలెజీ ‘దైవం దెయ్యం అను ప్రకృతి వికృతి’ అనే కవితలో వాడుకున్న హిందీ, తెలుగు పద్యపంక్తులు ఆ కవిత సాంద్రతని మరింత బిగుతు చేస్తాయి.

ఈ కవితలోని ‘మృతువునూ శోకాన్నీ వెంటపెట్టుకొని పుట్టాను/ నేను పుట్టిన చోటే నా పిల్లవాడు పుట్టాడు/ నేను మరణించాల్సిన చోట వాడు మరణించాడు..’ అనేవి రాతిగుండెలనైనా కరిగించే వాక్యాలు. తన కొడుకు మరణాన్ని రోదిస్తున్న ‘ఇలాగే’ అనే మరో కవితను ఈ సందర్భంలో గుర్తుకు చేసుకోవాలె. ‘పచ్చని చెట్టు మొదలంటా కూలిపోయింది’, ‘ఏం చేస్తాం బిడ్డా... ప్రాణానికి ప్రాణం అడ్డం వేసే దాకా అమ్మా నేనూ..’, ‘నెత్తిమీద కత్తుల కోలాటాలు/ శివతాండవం అనుకుంటాం కానీ/ శిలువైపోయి చిద్విలిస్తడు’ అనే వాక్యాలు చదువుతున్నప్పుడు కండ్లనీళ్ళు ఆపుకోలేక పోతాం.

భాషలో భాగంగా పాతుకుపోయి నాల్కల మీద నిత్యం నానుతుండే జాతీయాల్నీ, నానుడుల్నీ, సామెతల్నీ సందర్భోచితంగా విరివిగా వాడుకొని కూడా కవిత్వాన్ని పరిపుష్టం చేస్తాడు ప్రతాపరెడ్డి. ఇంకా ‘అలావా’ అనే కవితను మొత్తానికి మొత్తమే ఇందుకు ఉదాహరణగా పేర్కొనాలి.

‘చిటారు కొమ్మన మిఠాయిపొట్లం/ ఊరిస్తది ఊగిస్తది..’, ‘వూదు కాల్తదని పీరు లేస్తదని’ ఎప్పుడైనా ఊహిస్తిమా! ‘పప్పులెప్పుడన్నా ఉడికెనా’, ‘పిండానికి పెట్టినట్టు కూసుంటం/ కాకులు ముట్టయి గద్దలెత్తుకు పోతాయి’ వంటివి భావ స్పష్టీకరణకు తోడ్పడతాయి. నిజానికి ప్రతాపరెడ్డి ఒక్కో కవితని విడివిడిగా విస్తారంగా చర్చించుకోవాలె. 

తెలియక నడక- తెలిసి దుఃఖం, 

కాసుల ప్రతాపరెడ్డి కవిత్వం 

(1988 నుంచి 2024 వరకు), పేజీలు:114, 

వెల: రూ.120/- ప్రతులకు: తెలంగాణ పబ్లికేషన్స్, ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్, హైదరాబాద్-20. 

ఫో॥ 8639972160, 

కవి సెల్ నంబర్: 9848956375

(‘ముందుమాట’లోంచి సంక్షిప్తంగా..)

 బైరెడ్డి కృష్ణారెడ్డి