భానుడి భగభగ!
- జగిత్యాల లో43.4
కరీంనగర్లో కర్ఫ్యూ వాతావరణం
కరీంనగర్ , ఏప్రిల్ 1౫ (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత తో జనం విలవిల్లాడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడంతో జనం బెంబెలెత్తిపోతున్నారు. గత నాలుగు రోజుల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు 39 నుంచి 40 డిగ్రీలకు చేరుకోగా బుధవారం ఉదయం 11 గంటల వరకే కరీంనగర్ జిల్లాలో 42.8, జగిత్యాల జిల్లాలో 43.4, పెద్దపల్లి లో 42.7, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 42.8 డిగ్రీల సెల్సీయస్ గా నమోదయ్యాయి.
ఏప్రిల్ రెండవ వారంలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే ఈనెలాఖరుల, మే మాసంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరో నాలుగైదు రోజులు ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు చేరుకుంటాయని, ఎండల తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఉదయం 10 తర్వాత బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.
వారం రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణశాఖ జిల్లాను ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఎండల తీవ్రత విపరీతంగా పెరిగినందున ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య పనులు ముగించుకొని ఇళ్లకు చేరుకోవడం శ్రేయస్కరమని,
ఆ తర్వాత 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రావద్దని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాలు, మండలాల్లో చలివేంద్రాల ఏర్పాటు, ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాల్లోనూ తాగునీరు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. తప్పనిసరి బయటకు రావలసి వస్తే తలపై టోపీ, పాగా, రుమాలు చుట్టుకోవాలని, ఏదైనా వస్త్రం ధరించాలని సూచించారు.
కర్ఫ్యూ వాతావరణం
ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో మధ్యాహ్నం రోడ్లపై జనసంచారం పూర్తిగా తగ్గిపోయి కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.. నిత్యం రద్దీగా ఉండే కరీంనగర్ బస్టాండ్ రోడ్, తెలంగాణచౌక్, కమాన్చౌరస్తా, మార్కె ట్, టవర్సర్కిల్, మంకమ్మతోట, రాంనగర్, జ్యోతినగర్, కోర్టు చౌరస్తా, సివిల్ హాస్పిటల్ చౌరస్తాతో పాటు అన్ని రోడ్లలో జనం లేక వెలవెలబోయాయి.
రాత్రి 7 గంటల వరకు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడమే కాకుండా ఉదయం 7గంటల నుంచే వేడిగా వడగాల్పులు వీచడంతో ఓ వైపు ఎండల వేడిమి, మరోవైపు వేడిగాలితో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైబడి నమోదవుతాయని వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.






