16-12-2025 12:19:34 AM
నూతన ప్రజాప్రతినిధులకు సన్మానం
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి
మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 15: పంచాయతీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని సొంతం చేసుకుని విజయాన్ని అందుకున్న హన్వాడ మండలంలోని నూతన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు వార్డు సభ్యులకు క్యాంపు కార్యాలయంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఘనంగా సన్మానించి అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలిచ్చిన అధికారం బాధ్యతతో కూడుకున్నదని గుర్తు చేశారు.
గ్రామాల్లో శాంతి, సమైక్యత, పరస్పర గౌరవం నెలకొల్పుతూ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకొని గ్రామాలను ఆదర్శవంతమైన అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలలపై ప్రత్యేక దృష్టి అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని సూచించారు.
ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులుగా నిలబడి, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్.పీ. వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, మారేపల్లి సురేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మీడియా ఇన్చార్జీ సీజే బెనహర్ తదితరులు పాల్గొన్నారు.