08-08-2025 01:56:07 AM
ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి మరమ్మతు చేపిస్తాం
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
జడ్చర్ల ఆగస్టు 7 : గత ప్రభుత్వం కమిషన్ల కోసమే చెక్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టిందని నాసిరకంగా నిర్మించి వారికి రావలసిన నిధులను రాబట్టుకోవడం జరిగిందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి విమర్శించారు. మిడ్జిల్ మండలం మిషన్ కాకతీయ ఫేస్ - 4 లో భాగంగా వాస్పూల కత్వను పునరుద్ధరించుటకు 2019 ఏడాదిలో రూ 136.25 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన చెక్ డ్యాం కొంత భాగం కూలిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.
నాణ్యత లోపిస్తే నిర్మాణాలు ఇలానే ఉంటాయని, ప్రతినిర్మాణం నాణ్యతగా చేయాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరిగాయని, ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేకంగా చర్చించి మరమ్మత్తులు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఎక్కడ ఏ పని జరిగిన కాంట్రాక్టర్లు బాధ్యతగా నాణ్యతగా చేయాలని ఆదేశించారు. అలసత్వం వహిస్తే ఎంతటి వారిపైన అయిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.