08-08-2025 12:11:18 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 7 (విజయ క్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన నాగలక్ష్మి ముందు పెను సవాళ్లు ఉన్నాయి. ప్రధానంగా గత కొన్ని సంవత్సరాలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యాశాఖ పనితీరు గాడి తప్పింది. ఈ తరుణంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిఇఓ పెను సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ ప్రమోషన్ల వ్యవహారం చురుగ్గా సాగుతోంది.
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్థ వంతమైన సిబ్బంది లేక పోవడం వల్ల ప్రమోషన్ జాబితా పారదర్శకంగా నిర్వహించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. దీనికి తోడు వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియ ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ప్రమోషన్లను పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం డి ఈ ఓ బుజస్కందాలపై ఉంది. మరో ప్రధాన సమస్య జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలపై అజమాయేసి పూర్తిగా కొరవడిందనీ చెప్పక తప్పదు.
తాజాగా చుంచుపల్లి మండలంలో అనుమతి లేకుండా గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న శ్రీ చైతన్య పాఠశాలను బుధవారం సీజ్ చేయటమే అందుకు నిదర్శనం. ఈ అంశాన్ని ఏడాది క్రితమే విజయ క్రాంతి వెలుగు చూపినప్పటికీ విద్యాశాఖ అధికారులు నీమ్మకు నేరెత్తినటు వ్యవహరించారు. ఆ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం నుంచి ప్రతి నెల డీఈవో, ఎంఈఓకు నెలవారి మామూలు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
వారిచ్చే అమ్యామ్యాలకు తలోగ్గి అనుమతి లేకుండా ఏదేచ్ఛగా పాఠశాల నిర్వహించేందుకు సహకరించాలని తెలుస్తోంది. మూడు సంవత్సరాలుగా అనుమతి లేకుండా పాఠశాల నిర్వహించడమే అందుకు నిదర్శనం. ఇలా అనుమతి లేని పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా ముబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. కొత్తగూడెం లోని ఓ ప్రైవేటు పాఠశాల నిర్వహణపై ఎంఈ ఓ నోటీసు జారీ చేస్తే ఆ పాఠశాల నిర్వాహకులు కోర్టుకును ఆశ్రయించి నిలుపొదల చేయించడం, విద్యాశాఖ అధికారులపై ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం పెత్తనం చలాయిస్తున్నారు అనడానికి నిదర్శనం.
కొన్ని పాఠశాలల్లో అనుమతులు ఉన్న నిబంధనలో పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి. అక్రమ ప్రైవేటు పాఠశాలల నియంత్రణ పై కొరడా జులిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరో ప్రధాన సవాలు జిల్లా కార్యాలయంలో షాడో డీఈవోల పెత్తనం ఏదేచ్ఛగా సాగుతోంది. తగదునమ్మ అంటూ వారి విధులను పక్కన పెట్టి ప్రతి సమావేశం లోనూ, ప్రతి కార్యక్రమంలోనూ తామై కొనసాగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
గత డీఈవో అసమర్థత ను షాడో డీఈవోలు ఆసరాగా చేసుకుని ప్రతి అంశాన్ని కలెక్టర్ పేరుతో జిల్లాలోని ఎంఈఓలు, పి జి హెచ్ ఎం ల పై పెత్తనం చెలా యించారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు సైతం ఉన్నాయి. ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులను ఏక వచనంతో సంబోధిస్తూ అధికారాన్ని చలాయించారని ఆరోపణలున్నాయి.
దీంతో ఎంఈఓలు, ప్రధా నోపాధ్యాయులు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పక తప్పదు. మధ్యాహ్నం బోధన పథకం బిల్లులు సకాలంలో రాకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బిల్లుల సేకరణలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని, ఫలితంగా బిల్లులు సకాలంలో రాకపోవడం జరుగుతోంది.
తద్వారా కార్మికులు అప్పుల ఊబిలోకి నెట్ట బడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మధ్యాహ్నం భోజన పథకం పటిష్టంగా పారదర్శకంగా అమలు జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బిల్లులు సకాలంలో సమర్పించేలా చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీఈవో విద్యాశాఖను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు.