09-07-2025 12:00:00 AM
దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్రెడ్డి
మహబూబ్ నగర్ జూలై 8 (విజయ క్రాంతి) : ప్రజలకు మాయమాటలు చెప్పి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఇన్నేళ్లు గెలిచా మంటే ఎవరికి గొప్ప విషయమని మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం దేవరకద్ర నియోజకవర్గంలోని తమ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడారు.
రబ్బర్ చెప్పులు వేసుకున్న హరీష్ రావుకు వేలకోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని డి మాండ్ చేశారు. పాలమూరుకు నీళ్లు ఇచ్చామని హరీష్ రావు పచ్చి అబద్దాలు మాట్లాడుతుంటే, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా ప్రజలకు గణాంకాలతో సహా వాస్తవాలను చెప్పానని పేర్కొ న్నారు. వాస్తవాలు మాట్లాడితే భూజాలు తడుముకుని అలా వెంకటేశ్వర్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో విచిత్రంగా మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆల వెంకటేశ్వర్ రెడ్డి, హరీష్ రావు లు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు కాంట్రాక్ట్ వర్క్ లలో వ్యాపార భాగస్వాములుగా ఉన్నందుకు ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఎగిరి ఎగిరి పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. హరీష్ రావు ఏడుసార్లు గెలిచినంత మాత్రాన, పాడింది పాటగా అబద్ధాలు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చోమన్నారు.
ఆధారాలు చూపిస్తూ మాట్లాడుతున్నాం:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004 నుంచి 2014 వరకు ఏపీ అక్రమంగా 770 టీఎంసీలు కృష్ణా జలాలు తీసుకపోగా, 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పాలనలో ఏపీ ప్రభుత్వం ఏకంగా 1,225 టీఎంసీల నీళ్లు అక్రమంగా తీసుకుపోయినట్లు ఆధారాలతో సహా మాట్లాడితే, దానికి సమాధానం చెప్పకుండా ఎదురు దాడి చేస్తే భయపడే వారు ఎవ్వరు లేరన్నారు.
మీరు చేసింది ఒక తప్పు కాదు, 100 తప్పులు, పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఒక్కో బిఆర్ఎస్ ఎమ్మెల్యే వందల ఎకరాలు, వేలకోట్లు దోచుకున్నారని విమర్శించారు. అల వెంకటేశ్వర్ రెడ్డి 2014 ముందు నీ ఆస్తులన్నీ.. ఇప్పుడు నీ ఆస్తులు ఎన్ని..? నీకు జూబ్లీహిల్స్ బంగ్లా... హైవే వెంబడి వేల ఎకరాల భూములు నీకు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు.
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో భూత్పూర్, అడ్డాకుల్ మూసాపేట్ మండలాలలో వేల కోట్ల విలువైన నల్ల మట్టిని దోచుకున్నారని విమర్శించారు. ఒకటి కాదు రెండు కాదు పదేళ్ల పరిపాలనలో పక్కా ప్రణాళికలతో సంపాదించుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. పూర్తి ఆధారాలతో మీ బండారం మొత్తం పెడతానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులకు ఉన్నారు.