22-11-2025 06:24:22 PM
హైదరాబాద్: ఐబొమ్మ వెబ్ సైట్ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి విచారణ మూడోరోజు ముగిసింది. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకన్న పోలీసులు ఐబొమ్మ రవిని మూడోరోజు పైరసీ కేసులో ప్రశ్నించారు. సైబర్ నేరగాళ్లు, ఐబొమ్మ సైట్ మధ్య సంబంధాలపై విచారిస్తుంటే అతను సహకరించడంలేదని, పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడని పోలీసులు తెలిపారు. సినిమాల సేకరణ, సైట్లలో అప్ లోడ్ కు సంబంధించిన వివరాలు, విదేశాల్లో బృందాలు, ఆస్తులు, లింకులపై ఆరా తీసినట్లు సమాచారం.
యూజర్ ఐడీ, పాస్వర్డ్లు అడిగితే గుర్తు లేదు, మరిచిపోయా అని రవి సమాధానం ఇస్తున్నట్లు సమాచారం. ఎథికల్ హ్యాకర్ల సాయంతో హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లను పోలీసులు ఓపెన్ చేస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగిన విచారణలో సహకరించని ఐబొమ్మ రవికి సంబంధించిన ఖాతాల వివరాలను ఇవ్వాలని బ్యాంకులకు లేఖలు పంపించారు. డబ్బుల కోసమే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లు రవి ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఐబొమ్మ రవి కేసులో సీఐడీ రంగ ప్రవేశం చేసింది. సినిమాలు పైరసీ చేస్తూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన రవి బెట్టింగ్ యాప్స్ నుంచి వందల కోట్ల రూపాయలు లాభం పొందారు. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లలో పైరసీ సినిమాలు, నాలుగు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశాడు. ఇప్పటికే బెట్టింగ్ యాప్లపై విచారణ జరుపుతున్న సీఐడీ రవి ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరిస్తుంది.