01-11-2025 12:04:03 AM
త్రినాథ్ కటారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘ఇట్లు మీ ఎదవ’. ‘వెయేళ్లు ధర్మంగా వర్ధిల్లు’ అనేది ట్యాగ్లైన్. ఈ సినిమాను సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్పై బళ్లారి శంకర్ నిర్మిస్తున్నారు. సాహితీ అవంచ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, సాంగ్కి మంచి స్పందన వచ్చింది. శుక్రవారం మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో, దర్శకుడు త్రినాథ్ కటారి మాట్లాడుతూ.. “ఒక మంచి సినిమా చేశాం. చాలా మంది సీనియర్లు ఇందులో నటిస్తున్నారు. అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఎవరూ నన్ను కొత్తవాడిలా చూడలేదు. ఈ సినిమాకు కథే హీరో. ఇందులో నేను ఎదవ అని ఒక క్యారెక్టర్ చేశాను. ఇది ఒక తండ్రీకొడుకుల కథ, తండ్రీకూతుళ్ల కథ, ఒక అమ్మాయి అబ్బాయి కథ.. ఇలా వీళ్లందరి మధ్య ఉండే లవ్స్టోరీ” అన్నారు.
సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. “ఈ సినిమా కథ విన్నాను. అప్పుడే హిట్ వైబ్ వచ్చింది. నాకు బాపు సినిమా చేసే అవకాశం లేకుండాపోయింది. ఈ సినిమా చేస్తే ఆ కోరిక తీరుతుందని ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమాకు త్రినాథ్ ఎంతో అంకితభావంతో పనిచేశారు. ఈ టైటిల్ నేనే పెట్టాను. ఇంతకంటే మంచి టైటిల్ మరొకటి లేదనిపించింది. ఇది యూత్ అందరికీ బాగా నచ్చుతుంది.
యువత తమ తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లి చూపించే సినిమా అవుతుంది. క్లుమైక్స్లో ఎవరూ ఊహించని అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. ఈ సినిమాకు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో చాలా ఎంజాయ్ చేశాను” అని చెప్పారు. ‘ఇది నా ఫస్ట్ సినిమా. పట్నాయక్ మ్యూజిక్ అందించడం చాలా ఆనందంగా ఉంద’ని నిర్మాత బళ్లారి శంకర్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ రిషి, డైరెక్టర్ తేజ మర్ని, నటీనటులు గోపరాజు రమణ, దేవిప్రసాద్, మధుమణి, తాగుబోతు రమేశ్, డీవోపీ జగదీశ్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.