13-07-2025 12:15:00 AM
రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ బిల్లును పార్లమెంటులో అమలు చేసే బాధ్యత కేంద్రానిదే అంటూ గత 3 నెలలుగా సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే అది రాష్ట్రం పరిధిలోని అంశమంటూ బీజేపీ నేతలు దాటవేస్తూ వచ్చారు. ఇక ఈ అంశంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు బీసీ నేతలు ఢిల్లీకి పోయిరావడంతో పాటు రాష్ట్రంలోనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు కూడా చేశారు.
అయితే బీజేపీ నేతలు, ఆ పార్టీ అనుకూల బీసీ నేతలు మాత్రం లోకల్ బాడీ ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశంగా పేర్కొంటూ వచ్చారు. తీరా చూస్తే రాష్ట్ర క్యాబినేట్ బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఇన్నాళ్లు కేంద్రానిదే బాధ్యత అంటూ పేర్కొంటూ వచ్చిన కాంగ్రెస్ సర్కారు..లోకల్ బాడీ ఎన్నికల గడువు ముంచుకురావడంతో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ల హామీ ఒత్తిడికి తలొగ్గి ఒక్కసారిగా ఆర్డినెస్ జారీ చేసింది. అయితే ఈ చేసుడేందో 3 నెలల క్రితమే చేసింటే ఇప్పటికే గ్రామాల్లో స్థానిక సంస్థలు కొలువుదీరి కనీసం పారిశుద్ధ్య పనులనైనా చక్కగా చేసేందుకు అవకాశం ఉండేది కదా అని ప్రతిపక్షాల నేతలు సర్కారుపై మండిపడుతున్నాయి.
విజయభాస్కర్