05-01-2026 01:56:29 AM
ప్రశ్నోత్తరాల తర్వాత ప్రభుత్వ బిల్లులపైనా చర్చ
హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి) : అసెంబ్లీ సమావేశాల సందర్భం గా సోమవారం ‘హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్ ) పాలసీపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఉదయం 10గంటలకు శాసన సభ ప్రారంభం కాగానే సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.
తెలంగాణ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ గూడ్స్ సర్వీసెస్ పన్ను సవరణ బిల్లులను సీఎం రేవంత్రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. అదే విధంగా శాసన మండలిలో ఉదయం ప్రశ్నోత్తరాల తర్వా త ప్రభుత్వ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. పబ్లిక్ సర్వీసెస్ నియామకాల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, సిబ్బంది హేతుబద్ధీకరణ సవరణ బిల్లులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ చట్టం సవరణకు సంబంధించి రెండు కీలక బిల్లులను మంత్రి సీతక్క శాసన మండలిలో ప్రవేశపెట్టనున్నారు.
ఇక అసెంబ్లీలో మాత్రం హిల్ట్పాలసీపై చర్చ సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. నగరంలో ఉన్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలించి.. హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా చేయాలని ప్రభుత్వం హిల్ట్ పాలసీ తీసుకొచ్చింది. ఈ పాలసీపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. అసెంబ్లీలో దీనిపై వాడీవేడిగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.