29-09-2025 12:10:12 AM
మహబూబాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): సద్దుల బతుకమ్మ వేడుకలు మహబూబాబాద్ జిల్లాలో ఎన్నడు నిర్వహించుకోవాలన్న విషయంలో గందరగోళం ఏర్పడింది. చాలా చోట్ల 29 న నేడు (సోమవారం) నిర్వహించుకుంటుండగా, కొన్ని చోట్ల మాత్రం మున్సిపల్ అధికారులు 30న మంగళవారం నిర్వహించుకోవాలని పత్రికా ప్రకటన విడుదల చేయడం జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండుగ నిర్వాహనపై అయోమయం నెలకొంది.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 24న నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం 30 తేదీన సద్దుల బతుకమ్మ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చిందని, ఆ మేరకు ఆరోజు ప్రభుత్వపరంగా సద్దుల బతుకమ్మ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తామని మున్సిపల్ కమిషనర్లు ప్రకటించారు. అయితే ఎంగిలిపూల బతుకమ్మ ఆదివారం ప్రారంభించడంతో 29న సోమవారం 9 రోజులు కావస్తుండడంతో అదే రోజు నిర్వహించుకోవాల్సి ఉంటుందని,
పదవరోజు సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందని, అందుకే చాలా చోట్ల సోమవారం సద్దుల బతుకమ్మ వేడుక నిర్వహిస్తామని గ్రామాల్లో, పలు పురపాలికల్లో ఇప్పటికే ప్రకటించారు. అయితే మున్సిపల్ కమిషనర్లు మాత్రం ఒక్కో చోట ఒక్కో తీరుగా ప్రకటన జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. మరిపెడ, మహబూబాబాద్ లో 29న, కేసముద్రంలో 30వ తేదీన నిర్వహించుకోవాలని మున్సిపల్ కమిషనర్లు ప్రకటించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనితో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నేడు.. రేపు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.