10-12-2025 01:11:57 AM
2047 నాటికి జీఎస్డీపీలో 10% వాటా
మంత్రి జూపల్లి
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి) : తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు పర్యాట క రంగం కీలకం కానుందని, 2047 నాటికి రాష్ర్ట స్థూల దేశీయోత్పత్తిలో పర్యాటక రంగం వాటాను 10%కి పెంచాలని లక్ష్యం గా నిర్ధేశించుకున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ‘తెలంగాణ అనుభవాలు వారసత్వం, సంస్కృతి ఫ్యూచర్ రెడీ టూరిజం’ అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు కీలకోపన్యాసం చేశారు.
‘ప్రపంచవ్యాప్తంగా వనరులు తక్కువగా ఉన్న అనేక దేశాలు పర్యాటకాన్ని ప్రధాన ఇంజిన్గా చేసుకొని అద్భుతమైన ఆర్థిక పురోగతి సాధించాయి. తెలంగాణలోనూ ఈ రంగానికి అపారమైన సామర్థ్యం ఉంది’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.