02-11-2025 12:21:39 AM
నల్లగొండ జిల్లా చిట్యాలలో చెరువును తలపిస్తున్న రైల్వే బ్రిడ్జి అండర్ పాస్
నాలుగు రోజులుగా నిలిచిపోయిన వర్షపు నీరు
హైదరాబాద్-విజయవాడ ప్రయాణికుల ఇబ్బందులు
చిట్యాల, నవంబర్ 1 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద మొంథా తుఫాన్ ప్రభావంతో జాతీయ రహదారిపై నీరు నిలవడంతో శనివారం భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. చిట్యాల పట్టణ కేంద్రంలో రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ వద్ద వర్షపు నీరు చేరుకొని నాలుగు రోజులుగా చెరువుని తలపిస్తున్నది. దీంతో జాతీయ రహదారి 65పై హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులు వాహనాల రద్దీతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిత్యం రద్దీగా ఉండే హైవేపై నీటి నిల్వతో గుంతలు ఏర్పడి రైల్వే వంతెన కింద నుంచి వాహనాలు నెమ్మదిగా కలుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. శనివారం చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు ఐదు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. వర్షపు నీటిలో ఆటో ఇరుక్కుపోగా అక్కడే విధులు నిర్వహిస్తున్న మునుగోడు ఎస్సై ఇరుగు రవి, పోలీస్ సిబ్బంది ఆటోను తోసి బయటికి తీశారు. చిట్యాల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో వాహనాల రద్దీ మరింత పెరుగుతున్నది.