23-09-2025 12:00:00 AM
ఎమ్మెల్యే మురళీ నాయక్
మహబూబాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): నిలువ నీడలేని పేదవారికి గూడు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల మంజూరు మొదలుకొని నిర్మాణం, బిల్లుల చెల్లింపులో ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా, పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఆదేశించారు.
సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసముద్రం పట్టణ మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వివరాలు, బిల్లుల చెల్లింపు, మంజూరు తదితర అంశాలపై సమీక్షించారు. ఆధార్ మిస్ మ్యాచ్, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు వెరిఫికేషన్ లాంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని , ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ ఘంటా సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, మండల పార్టీ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, సొసైటీ మాజీ చైర్మన్ బండారు వెంకన్న, టిపిసిసి సభ్యుడు గుగులోతు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యే..
కేసముద్రం మండలం క్యాంపు తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మాతృ తండాలో తాగునీరు అందించడానికి వినియోగిస్తున్న మంచినీటి బావి మోటార్ పాడైపోయి నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే ఎమ్మెల్యే స్పందించి సీడిఎఫ్ నుంచి 50 వేల రూపాయలు మంజూరు చేసి విద్యుత్ మోటార్ అందజేశారు. సోమవారం విద్యుత్ మోటార్ బావికి అమర్చి నీరు సరఫరా చేయడంతో తండావాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.