calender_icon.png 17 August, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఖజానా’ దోపిడీ దొంగల అరెస్టు

17-08-2025 12:41:34 AM

  1. పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
  2.    900 వెండి ఆభరణాలు స్వాధీనం
  3. నాటు తుపాకులు, బుల్లెట్లు సీజ్
  4. మిగిలిన ఐదుగురి కోసం గాలింపు
  5. వివరాలు వెల్లడించిన మాదాపూర్ డీసీపీ వినీత్‌కుమార్

శేరిలింగంపల్లి, ఆగస్టు 16: చందానగర్‌లోని ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో శనివారం బిహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి నాటు తుపాకులు, బుల్లెట్లు, 900 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం మాదాపూర్ డీసీపీ వినీత్‌కుమార్ మీడియాకు వెల్లడించారు.

ఈ నెల 12న ఆరుగురు ముసుగు దొంగలు ఖజానా జ్యువెలర్స్ షోరూంలోకి చొరబడి, డిప్యూటీ మేనేజర్ సతీష్‌కుమార్‌పై కాల్పులు జరిపారు. దీంతో ఆయన ఎడమ మోకాలికి గాయమైంది. అనంతరం దుండగులు సుమారు 10 కిలోల వెండి వస్తువులు, బంగారు పూత పూసిన వెండిని దోచుకుని పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బిహార్ రాష్ట్రానికి చెందిన ఆశిష్‌కుమార్ సింగ్ (22), దీపక్‌కుమార్ సాహు (22)లను అరెస్ట్ చేశారు.

ఈ గ్యాంగ్ జీడిమెట్లలో ఇల్లు అద్దెకు తీసుకుని రెండు సెకండ్ హ్యాండ్ బైక్‌లు కొని, గత నెల రోజులుగా షాపుపై రెక్కీ నిర్వహించినట్లు విచారణలో బయటపడింది. దొంగలను పట్టుకోవడంలో ఎస్వోటీ, సీసీఎస్, లా అండ్ ఆర్డర్ పోలీసులు కీలక పాత్ర పోషించారని డీసీపీ తెలిపారు. ఇకపై జ్యువెలరీ షాపుల యజమానులు భద్రతా ఏర్పాట్లు కచ్చితంగా చేయాలని, ఇంట్రూషన్ అలారం వ్యవస్థలు అమర్చుకుని వాటిని పోలీస్‌స్టేషన్‌కు లింక్ చేయాలని సూచించారు. మిగిలిన ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.