calender_icon.png 13 July, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టహాసంగా ఆల్ ఇండియా చెస్ పోటీలు ప్రారంభం

12-07-2025 07:52:02 PM

600 మందికి పైగా క్రీడాకారులు హాజరు..

తొలిరోజు ముగిసిన నాలుగు రౌండ్ల పోటీలు..

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ వేదికగా జీనియస్ చెస్ అకాడమీ(Genius Chess Academy) ఆధ్వర్యంలో డెమొక్రటిక్ చెస్ ఫెడరేషన్ సహకారంతో కరీంనగర్ లోని వీ కన్వెన్షన్ లో శనివారం 3వ ఆల్ ఇండియా జూనియర్, ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్ 2025 పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 600 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. హాజరైన క్రీడాకారులకు స్విస్ లీగ్ పద్ధతిలో 8 రౌండ్ల వరకు పోటీలను నిర్వాహకులు ఏర్పాటు చేయగా తొలి రోజున నాలుగు రౌండ్ల వరకు పోటీలను నిర్వహించారు. అంతకుముందు ఈ పోటీలను జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి బి శ్రీనివాస్ గౌడ్, ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు దారం శ్రీనివాస్ రెడ్డి, సంగం లక్ష్మణ్, తెలంగాణ ఒలంపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డిలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి తొలి ఎత్తును వేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరీంనగర్ అంటేనే క్రీడా పోటీల నిర్వహణకు, క్రీడాకారులకు నిలయం అని అన్నారు. జాతీయస్థాయి చెస్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా ఉందని పోటీలను ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా వారు అభినందించారు. చదరంగం క్రీడ విద్యార్థుల మెదస్సుకు పదను పెడుతుందన్నారు. చెస్ లో రాణించిన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారు అన్నారు. ప్రస్తుత కాలంలో విద్యార్థులందరూ విశ్వనాథన్ ఆనంద్, గుకేష్, ప్రజ్ఞానంద్, అర్జున్ ఎరగేసి, కోనేరు హంపి లాంటి మహోన్నత వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని ఎదగాలని సూచించారు. పోటీల నిర్వాహకులు జీనియస్ అకాడమీ డైరెక్టర్ కోచ్ కంకటి అనూప్ కుమార్ మాట్లాడుతూ.. అందరి సహకారంతో కరీంనగర్ లో మూడవసారి ఆల్ ఇండియా స్థాయిలో పోటీలను నిర్వహించినట్లు తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో చెస్ క్రీడకు క్రేజీ తెచ్చేందుకే ప్రతి సంవత్సరం పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు సుమారు లక్ష రూపాయల పైగా నగదు పురస్కారాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీనియస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకులు కంకటి కనకయ్య, కోఆర్డినేటర్ సృజన్ కుమార్, చీఫ్ ఆర్బిటర్ బొల్లం సంపత్, ఉష టేబుల్ టెన్నిస్ క్రీడా సంఘాల కార్యదర్శులు భార విద్యాసాగర్, దారం గౌతమ్ రెడ్డి, జిల్లా ప్రైవేట్ వ్యాయామ విద్య ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ లతోపాటు నూనె సాయి కృష్ణ, తాటిపల్లి సతీష్ బాబు, క్రీడాకారులు, తల్లిదండ్రులు, పీఈటీ లు తదితరులు పాల్గొన్నారు.