12-07-2025 07:51:37 PM
కోదాడ: కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహ సంక్షేమ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వంగపల్లి పద్మ కు భారతరత్న పీవీ నరసింహారావు తెలుగు వెలుగు సాహితీ వేదిక పురస్కారం వరించింది. శనివారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభ కళావేదికలో పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సాహితీ వేదిక వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు పోలోజు రాజకుమార్ చార్యులు చేతులమీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.
గత పది సంవత్సరాలుగా ఉద్యోగ సామాజిక సేవా రంగంలో చేస్తున్న కృషిని గుర్తించి తెలుగు వెలుగు సాహితీ వేదిక సంస్థ తనకు ఈ అవార్డును అందించినట్లు వంగపల్లి పద్మ తెలిపారు. కాగా పురస్కారం రావడం పట్ల కోదాడ పట్టణ ప్రముఖులు, తోటి ఉద్యోగులు హర్ష వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.