20-10-2025 01:41:05 AM
తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏనుగు సంతోష్రెడ్డి
ముషీరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): ప్రస్తుతం అమలు చేస్తున్న 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 15 శాతానికి పెంచాలని తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి కోరారు. రిజర్వేషన్లను పటిష్టంగా అమలు చేయడానికి ప్రత్యేక కమీషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం దశాబ్ది ఉత్సవాలలో సంఘం ప్రధాన కార్యదర్శి కాచం సత్యనారాయణ గుప్తాతో కలసి ఆయన మాట్లాడారు. బీసీల 42శాతం రిజర్వేషన్లను అడ్డుకున్నారని, ఓసీలను ద్రోహులుగా చూస్తున్నారని, రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్లు కల్పిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బీసీ ఎస్సీ, ఎస్టీలకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
విదేశీ విద్యానిధి పథకాన్ని అగ్రవర్ణ పేదలకు అమలు చేసి రూ.10 లక్షలు ఎలాంటి షరతులు లేకుండా అందించాలని డిమాండ్ చేశారు. సంఘం ప్రతినిధులు భూపతి శర్మ, పవన్ కుమార్, తిరుపతి రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రమేష్ రెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.