08-07-2025 01:45:48 AM
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్, జూలై 7 (విజయ క్రాంతి): అభివృద్ధి చేయడం చేతకాక ప్రతిపక్షాలను ఆడి పోసుకుంటూ ఉట్టి మాటల ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి నిలుస్తున్నాడని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. మోకాలి శస్త్ర చికిత్స అనంతరం సోమవారం ఆమె మహబూబాబాద్ జిల్లా కొరవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ ఆరు హామీల అమలు, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగాల కల్పనపై బిఆర్ఎస్ చర్చకు సిద్ధం అని ప్రకటించినా సమాధానం చెప్పే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. మహబూబాబాద్ జిల్లా అనాధగా మారిపోయిందని, ఒక్క మంత్రి కూడా జిల్లా పరిస్థితి, అభివృద్ధిపై సమీక్ష నిర్వహించని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
ప్రజలు పాలకులకు గుణపాఠం నేర్పడానికి సిద్ధంగా ఉన్నారని, బీఆర్ఎస్ శ్రేణులు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం అండదండగా నిలవాలని ఆమె కోరారు.