20-08-2025 11:01:27 AM
నల్లగొండటౌన్,(విజయక్రాంతి): స్వాతంత్ర్య సమరయోధుడు,ప్రముఖ విద్యావేత్త కొండకింది చిన్న వెంకట్ రెడ్డి(Chinna Venkat Reddy) మరణం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్య ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు అని విద్యా సంస్థలు నెలకొల్పి లాభాపేక్ష లేని విద్యను చిన వెంకట్ రెడ్డి అందించారని కొనియాడారు. ఆయన నెలకొల్పిన మూడు పాఠశాలలు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలుగా ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందిస్తూనే ఉన్నాయని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు,విద్యా వేత్త అయిన చిన్న వెంకట్ రెడ్డి తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని భావోద్వేగానికి లోనయ్యారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.