10-05-2024 12:51:24 AM
మధ్యప్రదేశ్లో బీజేపీ నాయకుడి అత్యుత్సాహం
కుమారుడితో ఓటు వేయిస్తూ వీడియో చిత్రీకరణ
ప్రిసైడింగ్ అధికారి సస్పెన్షన్, బీజేపీ నాయకుడిపై కేసు
న్యూఢిల్లీ, మే 9: మధ్యప్రదేశ్లోని భోపాల్ లోక్సభ స్థానంలో ఈ నెల 7న జరిగిన పోలింగ్లో బీజేపీ నాయకుడు తన ఓటును కుమారుడితో ఓటు వేయించడం కలకలం రేపింది. ఓటింగ్కు సంబంధించిన 14 సెకన్ల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి దుమారం చెలరేగింది. భోపాల్ జిల్లాలోని బెరాసియా పట్టణంలో మంగళవారం మూడో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా స్థానిక బీజేపీ నాయకుడు వినయ్ మెహర్ తన కుమారుడితో పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. వినయ్ మెహర్ తరఫున ఆయన కుమారుడు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి బీజేపీ ఎన్నికల గుర్తుకు ఓటు వేస్తుండగా తండ్రి వీడియో తీశాడు. అనంతరం ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ కాగా కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ గుర్తించి బాలుడు ఓటు వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలోకి బాలుడిని ఎలా వెళ్లనిచ్చారు? మొబైల్ తీసుకువెళ్లేందుకు ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఇదంతా జరుగుతుంటే ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. బాలుడితో ఓటు వేయించడంపై భోపాల్ కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. పోలింగ్ బూత్ ప్రిసైడింగ్ అధికారి సందీప్ సైనీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.