20-09-2025 11:18:34 PM
మహిళల ఎదుగుదలకు సౌకర్యాలు కల్పిస్తున్నాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ఆర్థికంగా ఎదిగినప్పుడే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నగరం లోని ఎంప్లాయీస్ కాలనీ 20 వార్డు లో రూ 22 లక్షల ముడా నిధులతో నూతనంగా నిర్మించనున్న మహిళా సంఘాల భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో మహిళా సంఘాలను నిర్విర్యం చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో పావలా వడ్డీ బకాయిలు విడుదల చేశామని గుర్తు చేశారు.
డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని పది యేండ్ల ఆశ చూపించి అంగం చేశారని , కానీ ప్రజా ప్రభుత్వం లో ఇల్లు లేని ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని, సంవత్సరానికి ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు. కనీసం 50 గజాల సొంత ఇంటి స్థలం ఉన్న అందరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. మహిళలలకు ఆర్టీసీ బస్ లలో ఉచిత ప్రయాణాలు కల్పించడమే కాకుండా, ఆర్టీసీ బస్ లకే యజమానులను కూడా చేశామన్నారు. ఏ పథకం మైనా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.