09-05-2024 01:27:22 AM
ఆస్ట్రాజెనెకా సంచలన నిర్ణయం
వినియోగం తగ్గడమే కారణమని వెల్లడి
టీకా దుష్ప్రభావాలపై దుమారం
భారత్లో కొవిషీల్డ్ పేరుతో తయారీ
దుష్ప్రభావాలపై భారత్లో రాజకీయ దుమారం
న్యూఢిల్లీ, మే 8: ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ను తాము ఉపసంహరించుకుంటున్నట్టు సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంగ్లో ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వాక్స్జెవ్రియా పేరుతో యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి ఇప్పటికే ఉపసంహరించుకున్నట్టు తెలిపింది. మార్కెట్లో తమ వ్యాక్సిన్ వినియోగం తగ్గడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చింది. కొత్త వేరియంట్లతో పోరాడే అనేక వ్యాక్సిన్లు మార్కెట్లో లభిస్తున్నందున తమ టీకాకు గిరాకీ తగ్గిందని, వ్యాక్సిన్ను ఇకపై తయారు చేయబోమని, సరఫరా కూడా చేయబోమని వెల్లడించింది. యూరోపియన్ యూనియన్లో టీకా ఉపసంహరణకు మార్చి 5న దరఖాస్తు చేయగా, అది మే 7న అమల్లోకి వచ్చింది. వాక్స్జెవ్రియా పేరుతో తయారు చేసిన టీకాను కొద్ది నెలల్లోనే యూకే, ఇతర దేశాలలోనూ ఉపసంహరించుకునేందుకు దరఖాస్తులు సమర్పిస్తామని ఆ సంస్థ తెలిపింది. కరోనా వైరస్ను అంతం చేయడంలో తమ టీకా పోషించిన పాత్ర ఎంతో గర్వ కారణమని సంస్థ వెల్లడించింది. తొలి ఏడాదిలోనే టీకా వినియోగంతో 65 లక్షల మంది ప్రాణాలు కాపాడామని, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 300 కోట్ల టీకాలు సరఫరా చేశామని వివరించింది.
అదే కారణమా..? ఇంకేమైనా ఉందా?
ఇటీవల వాక్స్జెవ్రియా, కొవిషీల్డ్ టీకా వల్ల కొందరిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడ ం వంటి తీవ్రమైన దుష్ప్రభావాలు ఉన్నాయని తేలింది. ఈ టీకా కారణంగా యూకేలో కనీసం 81 మంది మృతిచెందగా, వందలాది మందిలో ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. దీంతో బాధితులు, వారి బంధువులు యూకే హైకోర్టులో ఆస్ట్రాజెనెకాపై 100 మిలియన్ పౌండ్ల దావా వేశారు. అయితే ఈ కేసుకు, టీకా ఉపసంహరణకు ఎలాంటి సంబంధం లేదని ఆస్ట్రాజెనెకా చెబుతోంది.
భారత్లో రాజకీయ దుమారం
భారత్లో ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కొవిషీల్డ్ పేరుతో తయారు చేసింది. భారత్లో మొదట కొవిషీల్డ్ వ్యాక్సినే అందజేశారు. కాగా, ఈ వ్యాక్సిన్ దుష్ప్రభావా లు బయటపడటంతో భారత్లో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ చేయకుండా గుడ్డిగా దేశ ప్రజలకు అంటగట్టారం టూ విపక్షాలు తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. అయితే కొవిషీల్డ్ వ్యాక్సిన్ చాలా ప్రభావవంతమైనదని, ఎలాంటి దుష్ప్రభావాలు లేవని ప్రధాని మోదీ సహా, బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు వెనకేసుకొచ్చారు. అయితే ప్రధాని మోదీ కొవిషీల్డ్కు క్లీన్ సర్టిఫికెట్ ఇస్తుంటే.. మొత్తం ప్రపంచ మార్కెట్ నుంచి వ్యాక్సిన్లను ఉపసంహరించుకుంటామని ఆస్ట్రా జెనెకా ప్రకటించడం గమనార్హం.