19-11-2025 01:00:06 AM
ఉప్పరిగూడ మాజీ ఉప సర్పంచ్ బూడిద నర్సింహారెడ్డి
ఇబ్రహీంపట్నం, నవంబర్ 18: వర్షాల వల్ల నీటమునిగిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకులు, ఉప్పరిగూడ మాజీ ఉప సర్పంచ్ బూడిద నర్సింహారెడ్డి అన్నారు. ఇటీవల మొంథా తుపాన్ వల్ల కురిసిన వర్షాలకు రాచ కాలువతో పాటు, పెద్దవాగు నుండి భారీగా వరద వచ్చి ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకు చేరింది. దీంతో నీటిమట్టం పెరగడంతో చెరువుకు అనుకొని ఉన్న ఉప్పరిగూడ గ్రామానికి చెందిన రైతుల పంట పొలాలలు నీట మునిగాయి.
కాగా మంగళవారం బూడిద నర్సింహారెడ్డి, పలువురు నాయకులు, బాధిత రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. 40 మంది రైతుల పొలాలు 80 ఎకరాల వరకు వరి పంట నీట మునిగి తీవ్ర నష్టాన్ని కలిగించాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో సన్నకారు, చిన్నకారు పేద రైతులు కౌవులు రైతులు అప్పులు తెచ్చుకొని పెట్టుబడులు పెట్టి అన్నమో రామచంద్రా అని అలమటిస్తున్నారని అన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి, పేద రైతుల కు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరారు. రైతులకు పంట నష్టపరిహారం వచ్చేంతవరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని రైతులకు ఆయన భరోసా కల్పించారు. నరసింహారెడ్డితో పాటు మడుపు గోపాల్, దండే నరసింహ, బత్తుల వెంకటేష్, జక్కుల జంగయ్య, నల్లోలబుగ్గ రాములు, బోసుపల్లి మోహన్, రైతులు నర్కుడి బుగ్గ రాములు, నర్కుడి మైసయ్య, నర్కుడి మోహన్, రామీడి లక్ష్మారెడ్డి, కౌలు రైతులు మునీర్, బూడిద జంగారెడ్డి ఉన్నారు.