25-07-2024 01:17:49 AM
శ్వేత పత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): గత ప్రభుత్వ హాయాంలో జరిగిన మద్యం అక్రమాలపై లోతైన విచారణ జరిపిస్తామని, అవసరమయితే ఈడీకి కూడా సిఫారసు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ఏపీ అసెంబ్లీలో ఎక్సైజ్శాఖపై ఆయన శ్వేత పత్రం విడుదల చేసి మాట్లాడారు. ప్రభుత్వంలోని ఇతర శాఖలలోని డబ్బును తీసుకు వచ్చి ఎక్సైజ్శాఖలో పెట్టుబడి పెట్టించారని, దీంతో ఆయా శాఖలకు రూ.250 కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలిపారు.
ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఏ విధంగా ప్రక్షాళన చేయాలో సభ్యులు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. సరైన పాలసీలు తీసుకు వచ్చి పేదలకు అందుబాటు ధరలో మద్యం లభించే విధంగా చూడటంతో పాటు డీఆడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తప్పు చేసిన వాళ్లను కఠినంగా శిక్షిస్తేనే మళ్లీ తప్పు జరగకుండా ఉంటుందన్నారు. ప్రజలకు హామీ ఇచ్చామంటే అమలు చేసేదిగా ఉండాలని, మద్యం ధరలు పెంచుకుంటూ పోతే తాగే వాళ్లు తగ్గుతారని చెప్పి.. ధరలు విపరీతంగా పెంచారని, మద్య వినియోగం పెరిగినా ఏపీలోఆదాయం మాత్రం తగ్గిందన్నారు.