05-10-2025 12:57:36 AM
చర్ల, అక్టోబర్ 4 (విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు చర్ల మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన బట్టిగూడెం, బత్తినపల్లి, రామచంద్రాపురం గ్రామాలను శనివారం సందర్శించారు. సీఆర్పీఎఫ్ 141బీఎన్ కంపెనీ కమాండర్ సెబాస్టియన్, చర్ల సీఐ రాజు వర్మ , ఇతర పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి గ్రామాల్లోని 120 కుటుంబాలను సందర్శించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ఈ మూడు గ్రామాల ప్రజలకు నెజిల్ కంపెనీ వారి సహకారంతో నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. ఎస్పీ సారథ్యంలో ఏజెన్సీ ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు విద్య, వైద్యం, రవాణా వంటి కనీస సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.