31-12-2025 01:20:22 AM
కోల్కతా, డిసెంబర్ ౩౦: ‘ బెంగాల్లో అక్రమ చొరబాట్లు ఉన్నాయని, మేం ఉగ్రవాదాన్ని ప్రోత్సహి స్తున్నామని కేంద్ర మంత్రి అమిత్షా ఆరోపిస్తున్నారు. కశ్మీర్లో ఉగ్రవాదులు లేకపోతే మరి పహల్గాంలో దాడి చేసిందెవరు? కేంద్రమే ఆ దాడి చేయించిందా? ఢిల్లీ పేలుళ్ల వెనుక ఎవరున్నారు?’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్కతాలో చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఎన్నికలు రాగానే దుర్యోధన, దుశ్శాసనుల్లా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్షా బెంగాల్లో ప్రత్యక్షమవుతారని ఎద్దేవా చేశారు.
ఓటర్ల జాబితా సవరణ పేరుతో కోటిన్నర మంది పేర్లను తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు. బెంగాలీల ఓటు హక్కు హరించేలా కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు తొలగించినా ఊరుకోబోమని హెచ్చరించారు. అవసరమైతే ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. సరిహద్దుల వద్ద ఫెన్సింగ్ కోసం రాష్ర్ట ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదన్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. పెట్రాపోల్, చంగ్రాబందా ప్రాంతాల్లో ఇప్పటికే భూమి కేటాయించామని తెలిపారు.