calender_icon.png 22 August, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు "పనుల జాతర" దోహదం

22-08-2025 07:18:17 PM

కుభీర్: గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు పనుల జాతర కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ఎంపీడీవో సాగర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నిర్మల్ జిల్లా కుభీర్ మండలం రంజని తాండ గిరిజన గ్రామంలో ఈజీఎస్ నిధులు రూ.9.69 లక్షలతో చేపట్టిన వ్యవసాయ క్షేత్రాలకు రోడ్డు, రూ.5.60 లక్షలతో చేపట్టిన సేద్యపు బావులను ఈజీఎస్ ఏపీవో రాథోడ్ హరిలాల్, ఎంపీ ఓ మోహన్ సింగ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ నిధుల ద్వారా ఇందిరా మహిళా శక్తి ఉపాధి భరోసా కింద పశువుల పాకలు గొర్రెల షెడ్లు కాంపోస్టు గుంతలు, సేద్యపు బావులు, వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే పొలం బాటలు, కోళ్ల ఫారాలు, నర్సరీల పెంపకం, జలనిధి కింద చెక్ డ్యాములు, ఊట కుంటల నిర్మాణాలు చేపట్టవచ్చని అన్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ఆధ్వర్యంలో గ్రామీణ రహదారులు తాగునీటి సరఫరా పనులు చేపట్టవచ్చని అన్నారు.

అంగన్వాడి కేంద్రాల్లో టాయిలెట్స్ నిర్మాణం తదితర గ్రామ అభివృద్ధికి అవసరమయ్యే పనులు ఈ పనుల జాతరలో భాగంగా చేపట్టి గ్రామాల పురోభివృద్ధికి కృషి చేయనున్నట్లు ఆయన వివరించారు. అంతకు ముందు గ్రామంలో పనుల ప్రారంభం చోట రైతులు  వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా అలంకరణ చేపట్టారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని గిరిజన గ్రామంలో ప్రారంభించడం గర్వించదగినదని అన్నారు.