27-09-2025 12:43:28 AM
న్యాయం కోసం మహిళా సంఘాలతో కలిసి యువతి పోరాటం
మణుగూరు,(విజయక్రాంతి): ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తీరా గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించిన యువకుడి ఉదాంతం శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కడపకు చెందిన యువతితో మణుగూరు వాగు మల్లారానికి చెందిన మట్ట గణేష్ కు బెంగుళూరులో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తాను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికి శారీరకంగా లొంగదీసుకున్నాడు. తీరా యువతి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని గణేష్ ను కోరగా, తనకు ఇదివరకే వివాహమైందని పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆ యువతి న్యాయం కోసం శుక్రవారం అక్షర మహిళా మండలి సభ్యులను ఆశ్రయించింది.
వారితో కలిసి యువతకి న్యాయం చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ యువతి విలేకరుల సమావేశంలో తనకు జరిగిన అన్యాయం వివరిస్తూ కన్నీటి పర్యాంతమైంది. ఆమె తెలిపిన వివరాల మేరకు ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించి గణేష్ తీరా తన శారీరకంగా వాడుకొని గర్భవతిని చేశాడని తనకి పెళ్లి అయిన విషయం దాచిపెట్టి మోసం చేశాడని ఆరోపించింది. వివాహం అయిందనే విషయాన్ని నాలుగు సంవత్సరాలుగా తనను తనకు చెప్పకుండా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టాడు.
కొద్దిరో జుల క్రితం విషయం తెలిసి అడగగా మణుగూరుకురా మా తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి చేసుకుందామని రప్పించి తన కుటుంబ సభ్యులతో కలసి విచక్షణా రహితంగా దాడి చేశారని, అసభ్య పదజాలంతో దూషిస్తూ గణేష్, ఆయన తల్లి దండ్రులు దాడి చేశారని ప్రాణపాయ స్థితి నుండి తప్పించుకొని న్యాయం కోసం రేణుక అక్షర మహిళల మండల వారిని సంప్రదించగా వారితో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. తనలా ఏ ఆడపిల్ల మోసపోకుండా పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే ఊరుకునేది లేదని అన్ని మహిళా సంఘాల ద్వారా బాధితుడి ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.