13-08-2025 12:02:55 AM
మహబూబాబాద్, ఆగస్టు 12 (విజయ క్రాంతి): నూతన గృహప్రవేశం చేసిన కొద్ది గంటల్లోనే విద్యుదాఘాతంతో యువకుడు మరణించిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జాటోత్ సుమన్ (28) తండ్రి రఘురాం ఇటీవల తొర్రూరులో కొత్త ఇల్లు నిర్మించుకుని సోమవారం గృహప్రవేశం చేశారు. మంగళవారం విందు కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సమయంలో తెల్లవారుజామున 4 గంటలకు సుమన్ లేచి ఇంటి పైకప్పుపై జీరో బల్బ్ వెలగకపోవడంతో పైకి ఎక్కాడు.
అలంకరణ కోసం చిన్న గోడపై ఇనుపరాడ్కు పెట్టిన వైర్ను సరి చేస్తుండగా, కరెంట్ కనెక్షన్ వైర్ తెగి అతని మీద పడింది. దీంతో అతడు షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. ఈ సమయంలో మేనమామ నేతావత్ బిక్ష గమనించి కరెంట్ సరఫరా నిలిపివేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. విద్యుదాఘాతానికి గురైన సుమన్ను మెట్ల పైనుంచి కిందకు తీసుకువచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి అన్న జాటోత్ సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర గొల్లమూడి ఉపేందర్తెలిపారు.