విశ్వంభరలో విజయశాంతి?

24-04-2024 12:10:00 AM

అగ్రనటుడు చిరంజీవి  సీనియర్ నటి విజయశాంతి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అప్పట్లో హిట్ పెయిర్‌గా ఉన్న వీరిద్దరూ ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం ద్వారా ఒకే వేదికపై మనసు విప్పి మాట్లాడుకున్నారు. దీని ద్వారా ఇద్దరి మధ్య గల దూరం తగ్గిపోయిందని సినీ వర్గాలు భావించాయి. ఈ క్రమంలో ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళీ చిరంజీవి, విజయశాంతి తెర పంచుకోనున్నారు అనే వార్త ప్రాధాన్యతను సంతరిం చుకుంది. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం చిత్ర బృందం విజయశాంతిని సంప్రదించారట.

మహేశ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె భవిష్యత్తులో ప్రాధాన్యత గల పాత్రలు వస్తే నటించడానికి తాను సిద్ధమని అప్పట్లోనే తన సంసిద్దతను వ్యక్తపరిచారు విజయశాంతి. ఈ నేపథ్యంలో ‘విశ్వంభర’ చిత్రంలో నటించడం పట్ల ఆమె సుముఖంగా ఉన్నారట. రాజకీయాలు పక్కన పెడితే సినిమాల్లో ఇద్దరూ తారా స్థాయిని చేరుకున్న వారే. అలాంటి వారు మళ్ళీ ఒకే సినిమాలో నటించడం అన్నది ఆసక్తికరమైన అంశమే!