29-12-2025 12:59:44 AM
భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్
రేగొండ/భూపాలపల్లి,డిసెంబర్ 28(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాచిట్యాల మండలంలో పెద్దపులి సంచారం జరిగినట్లు సమాచారం అందిందని జిల్లా ఎస్పీ.సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ తెలిపారు.చిట్యాల మండలం జడల్పేట శివారు భీష్మ నగర్ ప్రాంతంలో పెద్దపులి ఎద్దుపై దాడి చేసి చంపిన ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటన నేపథ్యంలో స్థానిక ప్రజలు భయాందోళనకు గురైనప్పటికీ, ఆందోళన చెందవద్దని జిల్లా ఎస్పీ ప్రజలకు భరోసా ఇచ్చారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు రాత్రి సమయాల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఒంటరిగా అడవుల వైపు లేదా పొలాల వైపు వెళ్లవద్దని,పెద్దపులి కదలికలపై అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోలీసు శాఖ నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కదలికలు గమనించినా వెంటనే పోలీస్ స్టేషన్కు లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల భద్రతకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని, పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు అవసరమైన పోలీస్ బందోబస్తు కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.