09-02-2025 11:20:14 PM
సెక్యూర్ డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరగోని రాజుగౌడ్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రంలో అసంఘటిత కార్మికులుగా ఉన్న లక్షలాది మంది డ్రైవర్లకు తక్షణమే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ సెక్యూర్ డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరగోని రాజు గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ సెక్యూర్ డ్రైవర్స్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కార్యవర్తాన్ని ప్రకటించారు. నూతన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా కొంతం మహేష్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడుగా బి. ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా పొడుగు శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శులుగా జి. అనిల్, డి. పవన్, కోశాధికారిగా జె. కుమార్, సలహాదారులుగా వంగ కృష్ణకర్ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా నరసింహ, పి. మహేందర్, సీహెచ్ రమేష్, ఎన్ఎం మహేష్, వై. వీరన్నలు రాష్ట్ర సమితి సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా బైరగోని రాజు మాట్లాడుతూ... డ్రైవర్ లైసెన్స్పై ఉన్న ప్రమాద బీమా రూ. 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచి, సాధారణ మరణం పొందితే కూడా వర్తింపజేయాలని కోరారు. కుల, మత బేదం లేకుండా అర్హులైన ప్రతి డ్రైవర్కు సబ్సీడీ వాహనాలు ప్రభుత్వం అందించాలని అన్నారు. పెంచిన గ్రీన్ టాక్స్, క్వార్టర్ ట్యాక్స్లను తగ్గించాలని, ఓలా, ఉబెర్, రాపీడోలను నిషేదించి ప్రభుత్వమే రవాణా యాప్ను రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లకు అనుగుణంగా ఆటో, క్యాబ్ చార్జీలు పెంచాలని, అలేగే అర్హత కలిగిన ప్రతి డ్రైవర్లకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.