19-07-2025 12:00:00 AM
మైనర్ సభ్యత్వం ఇవ్వనందుకు దాడి, 14 మంది ఏబీవీపీ నాయకులను అరెస్టు
ఫర్నీచర్, బస్సు అద్దాలు ధ్వంసం, మహిళా వైస్ ప్రిన్సిపల్ శ్వేతకు గాయాలు
కొండాపూర్, జూలై 18 : మండల పరిధిలోని మల్కాపూర్ శివారులోని రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్ పై విద్యార్థి సంఘాల నాయకులు దాడికి పాల్పడ్డారు. విద్యార్థులకు సభ్యత్వం ఇవ్వలేదనే నెపంతో రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్ పై ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు దాడి చేశారని పాఠశాల ప్రిన్సిపల్ నిఖిల్ రంగరాజు తెలిపారు. ప్రిన్సిపల్ తెలిపిన వివరాల ప్రకారం పాఠశాలకు వచ్చి విద్యార్థులకు సభ్యత్వం కావాలని ప్రిన్సిపల్ ని కోరారు.
ఆ సమయంలో ప్రిన్సిపల్ రంగరాజు మేనేజ్మెంట్ మీటింగ్ లో ఉన్నారని పీఈటీ విజయ్ వారికి బదులు ఇవ్వడంతో విజయ్ పై విద్యార్థి సంఘాల నాయకులు చేయి చేసుకున్నారని తెలిపారు. శుక్రవారం వేణు. రాజు. ఆకాష్. మహేష్తో పాటు 20 మందితో పాఠశాలకు వచ్చి విద్యార్థులకు సంఘం సభ్యత్వాన్ని ఇవ్వాలని కోరగా యాజమాన్యం కుదరదని చెప్పడంతో పాఠశాలపై దౌర్జన్యానికి పాల్పడి కంప్యూటర్లను, ఫర్నిచర్, .
బయోమెట్రిక్ యంత్రాన్ని, బస్సు అద్దాలను ధ్వంసం చేసి ప్రిన్సిపల్ శ్వేతను గాయపరిచారని తెలిపారు. భయాందోళనకు గురైన పాఠశాల యజమాన్యం పోలీసు వారికి సమాచారం ఇవ్వగా డీఎస్పీ సత్తయ్య, సీఐ సుమన్, ఎస్ ఐ సోమేశ్వరి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
మైనర్ విద్యార్థులకు సభ్యత్వం ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘాల పేరుతో నాయకులు పాఠశాలపై కక్ష కట్టి ఈ విధ్వంసానికి పాల్పడ్డారని రావూస్ ఇంటర్నేషనల్ పాఠశాల ప్రిన్సిపల్ రంగరాజు అన్నారు. కాగా రావుస్ పాఠశాల డైరెక్టర్ దమ్మనేని విశ్వాసరావు ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన 14 మందిని అరెస్టు చేసి కేసు నమోదు చేయడం జరిగిందని కొండాపూర్ ఎస్.ఐ సోమేశ్వరి తెలిపారు.