18-07-2025 11:17:29 PM
పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
చేవెళ్ల: చేవెళ్ల నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మొయినాబాద్ మండలం నాగిరెడ్డి గూడ నుంచి బాకారం వెళ్లే రోడ్డుపై పెద్దఎత్తున వరద నీరు చేరడంతో బాకారం నుంచి ఎనికెపల్లి, కాశీంబౌలి, అమ్డాపూర్ సహా పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఎర్రగుంట చెరువు నుంచి వచ్చే వరద కాలువకు ఇరువైపులా ఉన్న తమ భూములకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రహరీలు నిర్మించడంతో అది నాగిరెడ్డి గూడకు వెళ్లే దారికి మళ్లింది. చేవెళ్ల మండలం ముడిమ్యాల, రావులపల్లి మీదుగా మేడిపల్లి వెళ్లే దారిలో వాగు పొంగడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. చేవెళ్ల మున్సిపాలిటీలోని ఎస్సీ బాలుర వసతి గృహం ఆవరణ చెరువును తలపించింది. నీళ్లు హాస్టళ్లలోకి చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.