26-07-2025 12:00:00 AM
కలెక్టర్ హైమావతి
దౌల్తాబాద్, జూలై 25: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హైమావతి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పిఎసిఎస్, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, తహసిల్దార్ కార్యాలయం, కస్తూరిబా పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎం, స్వీపర్ తప్ప ఎవరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రిజిస్టర్ తనిఖీ చేసి జిల్లా వైద్యశాఖ అధికారికి ఫోన్ ద్వారా విధులు సక్రమంగా నిర్వహించకుండా సమయానికి ఆసుపత్రికి రాని వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాన కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని అన్నారు. అనంతరం తండాలో ఇందిరమ్మ ఇండ్ల ను పరిశీలించారు. లబ్ధిదారులు ఇంటి నిర్మాణంలో ఆర్థికంగా ఇబ్బందుల వల్ల పిల్లర్లు లేకుండా ఇల్లు నిర్మించుకున్నట్లు తెలుపగా గృహ నిర్మాణ శాఖ ఏఈకి పర్యవేక్షణ చేసి కింద బేస్ గట్టిగా ఉండి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్మించాలని తెలిపారు.
తహసిల్దార్ కార్యాలయంలో భూభారతి రెవెన్యూ సంస్థల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈపాస్ మిషన్, ఇతరత్రా వివరాలు సరిగ్గా లేనందున సిబ్బందిపై ఆగ్రహం చేసి పూర్తి విచారణ చేయాల్సిందిగా డిసిఓ కు ఫోన్ ద్వారా ఆదేశించారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు వడ్డించాలని తెలిపారు.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులతో మాట్లాడారు. భోజనం రుచికరంగా ఉన్నాయా, హాస్టల్ వసతి సౌకర్యంగా ఉంద అని అడగ్గా బాగానే ఉందని తెలిపారు. అనంతరం రిజిస్టర్ లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీడీవో సయ్యద్ గపూర్ ఖాద్రి, మండల విద్యాధికారి కనకరాజు తదితరులు పాల్గొన్నారు..