31-01-2026 01:39:51 AM
గంటల్లోనే రూ.36 లక్షల కోట్లు ఆవిరి
12శాతానికి కుంగిన కంపెనీ షేరు విలువ
ఒక్కసారిగా కుదేలైన టెక్ దిగ్గజ సంస్థ
న్యూఢిల్లీ జనవరి 30: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ ఒక్క సారిగా కుదేలైంది. ఏఐ (కృత్రిమ మేధ) దెబ్బతో స్టాక్ మార్కెట్లో కొన్ని గంటల్లోనే ఆ కంపెనీ షేరు విలువ ఒక దశలో 12 శాతం కుంగింది. దాంతో ఆ సంస్థ విలువలో 400 బిలియన్ డాలర్ల మదుపర్ల సంపద ఆవిరైంది. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం రూ. 6 లక్షల కోట్లు. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక్క రోజులో ఈ స్థాయిలో పతనం కావడం ఇది రెండోది. గతేడాది జనవరిలో చైనాకు చెందిన డీప్సీక్ ఏఐ మోడల్ ప్రవేశంతో చిప్ తయారీ సంస్థ ఎన్విడియా 593 బిలియన్ డాలర్లను కోల్పోయింది.
2020 మార్చి తర్వాత..
2020 మార్చి తర్వాత మైక్రోసాఫ్ట్ ఈ స్థాయిలో నష్టాలను చవిచూడడం ఇదే తొలిసారి. 1986లో ఈ టెక్ సంస్థ ఐపీఓకు వచ్చిన తర్వాత ఈ స్థాయి నష్టాలను చూడటం చాలా తక్కువ. కృత్రిమ మేధపై కంపెనీ చేస్తున్న వ్యయాలతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. కృత్రిమ మేధ, కొత్త సాంకేతికతపై చేస్తున్న ఖర్చులపై ఇప్పటికే భారీగా చర్చ నడుస్తోంది. గతేడాది పెట్టిన భారీ పెట్టుబడులకు ఏమేరకు ప్రతిఫలాలు అందాయో తెలుసుకోవాలని వాటాదార్లు భావిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్, ఏఐ విభాగాలపై పెట్టుబడుల్లో 66 శాతం పెరుగుదల కనిపించింది. త్రైమాసికంతో పోలిస్తే మందగించింది. ఇది మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది.
నిరాశలో మదుపర్లు
రాబోయే ఏడాది కాలంలో డేటా సెంటర్ల మీద గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టనున్నాయి. దానికోసం గూగుల్ తప్ప మిగతా కం పెనీలన్నీ రుణాల బాట పట్టనున్నాయి. ఏఐతో తమకు స్వర్ణయుగం వస్తుందనే ఆశతోనే అప్పులు చేస్తున్నాయి. ఓపెన్ ఏఐ సంస్థ రాను న్న సంవత్సరాల్లో 1.4 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరం అవుతాయని చెబుతోంది. 2030కి గానీ తనకు లాభాలు రావని ఇప్పటి కే వెల్లడించింది. ఈ ఎదురుచూపులు మదుపర్లను నిరాశకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.