02-01-2026 12:35:54 AM
మద్యం తాగినందుకు అదుపులోకి తీసుకున్న కెనడా అధికారులు
వాంకోవర్ విమానాశ్రయంలో ఘటన
ఒట్టావా, జనవరి 1: ఎయిర్ ఇండియాకు చెందిన పైలట్ ఒకరు మద్యం తాగి విమానాన్ని ఎక్కుతుండగా అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కెనాడాలోని వాంకోవర్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఈ ఉదంతాన్ని జాతీయ మీడియా వెల్లడించింది. డిసెంబర్ 23న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫెస్టివ్ మూడ్లో ఉన్న పైలట్ మద్యం సేవించి వాంకోవర్ నుంచి ఢిల్లీకి బయలు దేరిన బోయింగ్ 777-ఏఐ 186 విమానాన్ని నడిపేందుకు సిద్ధమయ్యాడు.
అయితే ఆల్కహా ల్ వాసన వస్తున్నట్లు గమనించిన సిబ్బంది ఈ విషయాన్ని కెనడియన్ అధికారులకు సమాచారం అందించారు. దాంతో వెంటనే ఆ పైలట్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం ఆలస్యమైంది. ఈ సంఘటనపై దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా స్పందించింది. నిబంధనల ఉల్లంఘనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. తమ పైలట్ను కెనడా అధికారులు అదుపులోకి తీసుకున్నారని, భద్రతా ప్రొటో కాల్స్ను పరిగణనలోకి తీసుకొని వేరే పైలట్కు బాధ్యతలు అప్పగించామని తెలిపింది.