18-08-2025 12:51:27 AM
వ్యాపారవర్గాల నిర్ణయం
ఆమనగల్లు, ఆగస్టు 17: మార్వాడీ వ్యాపారులు గో బ్యాక్ అంటూ సోమవారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో స్థానిక వ్యాపారవర్గాలు బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ బంద్ను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు వ్యాపారావర్గాలు తెలిపాయి.
పట్టణపరిసర ప్రాంతాల్లో మార్వాడీలు వ్యాపారాలు పెంచుకుంటూ తక్కువ ధరలో వస్తువులను అమ్మడంతో తమ వ్యాపారాలు నడవడం లేదని, వారి వ్యాపార షాపుల్లో వారి మనుషులనే నియమించుకోవడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు రావడం లేదని, ఇది ఇలాగే కొనసాగితే తమ మనుగడ కష్టమని ఆవేదనతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా గోడును వెళ్లబోసుకున్నారు.
అయితే రాష్ట్రవ్యాప్తంగా మార్వాడీలే ఎక్కువ చోట్లా ఉంటున్నారని, తెలంగాణ ప్రజలకు వ్యాపారాలకు కూడా అవకాశం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇంటలిజెన్స్ వర్గాలు ఆమనగల్లు పట్టణ కేంద్రంలో పర్యటించారు. ఎంతమంది మార్వాడీలు ఏఏ వ్యాపారం చేస్తున్నారు, దీని కారణంగా ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి అనేదానిపై ఆరా తీశారు. పోలీసుల సూచనల మేరకు బంద్ను వాయిదా వేసినట్లు వ్యాపారులు తెలిపారు.